Wednesday, 11 May 2016

తిండి తినరా ముందు

శుభ్రంగా కాళ్ళూ, చేతులూ కడుక్కుని భోజనానికి కూర్చుంటాం.
మన అమ్మో, ఇల్లాలో మన కంచములో వేడి వేడి అన్నం వడ్డిస్తుంది.
అందులోకి ముద్దపప్పును వేస్తుంది.
 ఘుమఘుమలాడే నెయ్యిని చెంచాతో పోస్తుంది.
అంచుకు నోరూరించే ఆవకాయ.

మన ఆకలి రెట్టింపవుతుంది.
ఆత్రంగా దండయాత్ర మొదలుపెడతాం.
ఒక్కో ముద్ద లోనికి దిగుతుంటే, జీవుడు సంతోషంగా గంతులేస్తాడు.
 ఆహాహా!...ఏమి మన భాగ్యము!.....

ఇంతలో కఠక్ మని శబ్దం. పంటి కింద రాయి...

అంతకుముందటి దృశ్యం చెల్లాచెదరవుతుంది.
 ముఖం
రంగులు మారుతుంది.
కోపం నషాళానికి అంటుతుంది.

ఈ రాయి ఎక్కడిది?
 బియ్యం లోదా?
 పప్పులోదా?
మిల్లులోదా?
ప్లేటు శుభ్రంగా కడగకనా?
 ఇల్లు సరిగ్గా ఊడవకనా?....
.దాని గురించి జుట్టు పీక్కుంటాం.

తిండి సంగతి మరిచిపోతాం.
 వండినవాళ్ళ శ్రమను మరిచిపోతాం.
 వడ్డించినవాళ్ళ ప్రేమను మరిచిపోతాం.
ఆ ముద్ద మన నోటికి అందేవరకు జరిగిన గొప్ప విషయాలేమీ మనం గుర్తుంచుకోం.

ఆ ఒక్క రాయి మీదే మన దృష్టంతా.

చిన్న కారణానికి మంచి సంబంధం పాడుచేసుకుంటాం.

జీవితం కూడా అన్నం ముద్ద లాంటిదే!

భగవంతుడు మనకు ఈ జీవితమనే అన్నపుముద్దను ప్రసాదించాడు.

అందులో రాయి ఏమిటి?...చిన్న కష్టం.

అది రాగానే ప్లేటును పక్కన పడేసినట్టుగా, జీవితాన్ని పక్కన పెట్టేస్తాం. జీవించడం మానేస్తాం.
 ఎన్ని సంతోషాలున్నాయో, ఎన్ని అనుభూతులున్నాయో అవన్నీ విస్మరిస్తాం.
 రాయిలాంటి కష్టం మీదే మనసు పాడుచేసుకుంటాం.

ఇంత పెద్ద జీవితములో చిన్న కష్టాన్ని మనం ఓర్చుకోలేమా?.......

లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్.
 ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ జాయ్. ఇట్ ఈజ్ ఫుల్ లైఫ్.

అందుకే కష్టం వచ్చినప్పుడు మనసు రాయి చేసుకోండి.
 ఆ రాయిని పక్కన పెట్టండి. విందును తృప్తిగా ఆరగించండి.

No comments:

Post a Comment